గుండెపోటుతో ప్రముఖ రచయిత వెన్నెలకంటి మృతి

Friday, March 5, 2021 02:00 PM Entertainment
గుండెపోటుతో ప్రముఖ రచయిత వెన్నెలకంటి మృతి

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి చెన్నైలో గుండెపోటుతో (Vennelakanti Passes Away)  కన్నుమూశారు. వెన్నెలకంటి మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలు డబ్బింగ్‌ సినిమాలకు డైలాగ్‌ రైటర్‌గా పనిచేసిన వెన్నెలకంటి (Vennelakanti) పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌. ఎస్‌. గోపాల్‌రెడ్డి తీసిన మురళీ కృష్ణుడు(1988) మూవీతో వెన్నెలకంటి తెలుగు చిత్రసీమకు గేయ రచయితగా పరిచయం అయ్యారు.

ఈ మూవీలో ఆయన రాసిన అన్నీ పాటలు సూపర్‌ హిట్‌ అవడంతో వెన్నెలకంటికి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అనేక మేటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు పాపులర్‌ అయ్యాయి. ఆదిత్యా 369, తీర్పు, క్రిమినల్‌, శీను, టక్కరి దొంగ, మిత్రుడు, రాజా తదితర చిత్రాలకు ఆయన రాసిన పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి. డైలాగ్‌ రైటర్‌గా పంచతంత్రం, మొనాలీసా, దశావతారం, ప్రేమ ఖైదీ వంటి తమిళ చిత్రాలకు తెలుగులో డైలాగులు రాశారు. ఈయన పెద్ద కుమారుడు శశాంక్‌ వెన్నెలకంటి కూడా సినీ డైలాగ్‌ రైటరే. చిన్న కుమారుడు రాకేందు మౌళి లిరిసిస్టుగా, సింగర్‌గా, నటుడిగా రాణిస్తున్నారు.

తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. లిరిసిస్ట్‌గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు. మొత్తంగా ఆయన 1000కి పైగా చిత్రాలకు పని చేశారు. 

For All Tech Queries Please Click Here..!