ముంబైలో ఎన్‌సీబీ కస్టడీ నుంచి తప్పించుకున్న తెలుగు నటి

Wednesday, March 3, 2021 12:00 PM Entertainment
ముంబైలో ఎన్‌సీబీ కస్టడీ నుంచి తప్పించుకున్న తెలుగు నటి

బాలీవుడ్‌  డ్రగ్స్ కేసులో పలువురు తెలుగు హీరోయిన్ల పేర్లు వినిపించిన సంగతి విదితమే.  ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్‌ చాంద్‌ పాషా, సప్లయర్‌ సయ్యద్‌తో టాలీవుడ్ నటి (Tollywood actress) శనివారం రాత్రి పట్టుబడింది. అయితే  ముంబైలో డ్రగ్స్‌ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలీవుడ్‌ నటి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడీ (NCB custody) నుంచి తప్పించుకుంది. 

దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆమెను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, డ్రగ్స్‌ కేసులో నిందితురాలిగా ఉన్న సదరు టాలీవుడ్‌ నటికి మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కరీం లాలాతో కలిసి ఆమెకు డ్రగ్స్ వ్యాపారంలో వాటాలున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 రిపోర్ట్ చేసింది. 

ఈ నేపథ్యంలో కరీం లాలా కోసం ఎన్‌సీబీ (Narcotics Control Bureau (NCB) విసృతంగా గాలింపు మొదలుపెట్టింది. కరీం లాలా దేశం విడిచి వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను ఎన్‌సీబీ అప్రమత్తం చేసింది. పట్టుబడ్డ చాంద్‌ పాషా నుంచి 400 గ్రాముల డ్రగ్స్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో బాంద్రా, కుర్ల, అంధేరిలోనూ పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ చాంద్‌, సయ్యద్‌తో టాలీవుడ్‌ నటికి ఉన్న సంబంధాలపై ఎన్‌సీబీ ఆరా తీసినట్టు తెలిసింది. నిందితురాలు తెలుగులో నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినట్టుగా సమాచారం.

ఈ విషయమై ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే మాట్లాడుతూ.. ఈ విషయంలో కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని, కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.  ఇదిలా ఉంటే గతేడాది జూన్‌లో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య అనంతరం మాదక ద్రవ్యాల కేసులో అతని ప్రియురాలితో సహా ముగ్గురు టాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు తెరపైకి రావడం అప్పట్లో సంచలనానికి దారి తీసింది.

గతేడాది ఆగస్టు 15న హైదరాబాద్‌ నుంచి రహస్యంగా తరలిస్తున్న రూ.వందల కోట్ల మెఫిడ్రిన్‌ను ముంబైలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మరునాడు ముంబై డీఆర్‌ఐ అధికారులు నగర శివారుల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీని గుర్తించి మొత్తం ముడి సరుకును సీజ్‌ చేయడం అప్పట్లో సంచలనమే రేపింది. ఈ రెండు ఉదంతాలు మరవకముందే మూడోసారి హైదరాబాద్‌కు చెందిన నటి డ్రగ్స్‌ కేసులో అరెస్టవ్వడం షాకింగ్ కలిగించే అంశం. ఇక టాలీవుడ్ నటి ముంబైలో ఎందుకుంది? డ్రగ్స్‌ సప్లయర్‌ అయిన సయీద్‌తో ఆమెకు ఏం పని? హైదరాబాద్‌ నుంచి వచ్చే డ్రగ్స్‌తో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో ఎన్‌సీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. 
 

For All Tech Queries Please Click Here..!