దృశ్యం సినిమాలో గుళ్లో ప్రవచనాలకు వెళ్లినట్టే కథ అల్లారు , చివరికి ఒక చిన్న లాజిక్ లో దొరికారు..!

Thursday, April 22, 2021 05:17 PM Crime
దృశ్యం సినిమాలో గుళ్లో ప్రవచనాలకు వెళ్లినట్టే కథ అల్లారు , చివరికి ఒక చిన్న లాజిక్ లో దొరికారు..!

వెంకటేష్ దృశ్యం సినిమా గుర్తుండే ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఓ యువకుడిని హత్య చేసిన తన కుటుంబ సబ్యులని పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ శవాన్ని హీరో ఎలా మాయం చేశారన్నదే ఈ సినిమాకు కొనసాగింపు. ఆ ట్విస్ట్‌ను దృశ్యం-2 లో దర్శకుడు రివీల్ చేశాడు. 

సరిగ్గా అలాంటి ఘటనే కేరళలో జరిగింది. ఓ కుటుంబంలో ఒక వ్యక్తి అసభ్య ప్రవర్తన అతని హత్యకు దారితీసింది. ఆ కుటుంబమే వ్యక్తిని చంపేసి ఇంటి వెనకున్న పెరట్లో పాతిపెట్టింది. దాదాపు రెండున్నర సంవత్సరాలు ఆ వ్యక్తి మర్డర్ మిస్టరీగానే ఉంది. తాజాగా ఈ కేసును కేరళ పోలీసులు చేధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే కేరళలోని కొల్లాం జిల్లాలో ఉన్న ఎర్రూర్ గ్రామంలో సజిన్ పీటర్, షాజీ పీటర్ అనే ఇద్దరు అన్నదమ్ములు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. షాజి పీటర్ ప్రవర్తన మొదటి నుంచి సరిగా ఉండేది కాదు. కుటుంబంతో ఎప్పుడూ గొడవపడుతుండేవాడు. కొన్నేళ్ల క్రితం షాజి ఇంటి నుంచి పారిపోయాడు. సజిన్ పీటర్ మాత్రం ఆర్య అనే యువతిని పెళ్లి చేసుకుని తల్లితో కలిసి ఇంట్లోనే ఉంటున్నాడు. షాజికి చాలా ఏళ్ల తర్వాత సొంతూరిపై గాలి మళ్లింది. ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నాడో తెలియదు గానీ. 2018లో ఓనమ్ పండుగ సమయానికి ఇంటికి చేరాడు. అయితే అన్ని సంవత్సరాల తర్వాత కూడా షాజి బుద్ధి మారలేదు.

మొదటి నుంచి ఉన్నట్టే అల్లరిచిల్లరిగా ఉన్నాడు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తమ్ముడు సజిన్ భార్య ఆర్య ఒంటరిగా ఉండటం చూసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను తమ్ముడు భార్య అని కూడా చూడకుండా తాకరాని చోట తాకుతూ వెకిలి వేషాలు వేశాడు. ఈ విషయం భర్తతో చెప్పుకుని ఆర్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే.. అన్నాదమ్ముల మధ్య గొడవైంది. ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారినట్టుగా ఒకరినొకరు కొట్టుకునేంత వరకూ వెళ్లింది. సజిన్ తన అన్నయ్య షాజిని చావబాదాడు. తీవ్ర గాయాలపాలైన షాజి చనిపోయాడు. దీంతో.. తొలుత కంగారు పడిన సజిన్, అతని భార్య, తల్లి ఆ తర్వాత తేరుకుని షాజి మృతదేహాన్ని ఇంటి వెనకున్న పెరట్లో పూడ్చి పెట్టారు. శవంపై దళసరి షీట్ ఒకటి కప్పి పూడ్చేశారు.

ఆ తర్వాత పూడ్చేసిన ప్రాంతాన్ని కాంక్రీట్‌తో చదును చేశారు. ఓనమ్ పండుగకు వచ్చిన షాజి కనిపించకపోవడంతో ఊళ్లో ఎవరో ఒకరు షాజి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడని అడిగేవారు. అలా ఎవరు అడిగినా.. షాజి మలప్పురం జిల్లాలో పనిచేస్తూ.. అక్కడే ఉంటున్నాడని.. పండుగకు వచ్చిన షాజి మళ్లీ అక్కడికే వెళ్లాడని చెప్పాలని సజిన్, అతని భార్య, తల్లి నిర్ణయించుకున్నారు.

ఎవరడిగినా ‘దృశ్యం’ సినిమాలో సాయిబాబా గుళ్లో ప్రవచనాలకు వెళ్లామని హీరో  కుటుంబం చెప్పినట్టు.. అందరికీ ఒకటే చెప్పేవారు. అలా రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఇన్నాళ్ల తర్వాత షాజి ఏమైపోయాడన్న నిజం గ్రామస్తులకు తెలిసింది. పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని చేధించారు. విచారణలో షాజిని చంపి పెరట్లో పూడ్చి పెట్టినట్లు తేల్చారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు షాజి ఎముకల శకలాలను సేకరించారు. సజిన్ కుటుంబంపై కేసు నమోదు చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: