Rajinikanth's Political Entry: పార్టీ పెట్టాలంటూ అభిమానుల ఒత్తిడి, రజినీకాంత్ వ్యూహం ఏంటీ? 

Tuesday, January 12, 2021 04:45 PM Entertainment
Rajinikanth's Political Entry: పార్టీ పెట్టాలంటూ అభిమానుల ఒత్తిడి, రజినీకాంత్ వ్యూహం ఏంటీ? 

 Chennai, Nov 30: తమిళనాడు రాజకీయాల్లోకి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్  ((Rajinikanth's Political Entry Row)) వస్తారనే ఊహాగానాలపై ఈరోజుతో తెరపడుతుందని అనుకున్నారు. హోం మంత్రి అమిత్ షా చెన్నై వచ్చి వెళ్లిన తరువాత రజినీకాంత్ హఠాత్తుగా అభిమాన సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.  ఈరోజు అభిమానులతో మీటింగ్ తరువాత పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ ఖచ్చితంగా ఒక ప్రకటన చేస్తారని అనుకున్నారు.  అయితే, అభిమాన సంఘాలతో (Rajani Makal Mandaram) మీటింగ్ తరువాత రజినీకాంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అభిమానులు, అభిమాన సంఘాలు పార్టీపేరు ప్రకటించాలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రజినీపై ఒత్తిడి (political announcement) తీసుకొచ్చాయి.  ఇంకా ఆలస్యం అయితే నష్టం కలుగుతుందని అభిమానులు ఒత్తిడి తీసుకొచ్చారు.  ఇప్పటికిప్పుడు మనకు రాజకీయాలు వద్దులే అని సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రజినీకాంత్ సమావేశం అనంతరం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.  ప్రస్తుతం రజినీకాంత్ అత్యంత సన్నిహితులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం తరువాత రజినీకాంత్ ప్రకటన చేస్తారేమో చూడాలి.

ఇదిలా ఉంటే అభిమానులు బీజేపీ వ్యతిరేక నినాదాలు చేస్తూ, రాజకీయాల్లోకి రావాలని, ఈ మేరకు రజనీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఫ్యాన్స్ అంతా ముక్తకంఠంతో ప్రశ్నించారు. వారందరికీ  రజనీ  సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అభిమానులు, జిల్లా కమిటీల ప్రతినిధులు దాదాపు 50 నిమిషాల పాటు మాట్లాడారు. తమ హీరో వస్తే మాత్రమే ఓటేస్తాం తప్ప, ఆయన మరో పార్టీకి మద్దతిస్తామని చెబితే ఏ మాత్రమూ సదరు పార్టీకి మద్దతివ్వబోమని పలువురు స్పష్టం చేయడం గమనార్హం.

ఆ తరువాత రజనీ ప్రసంగిస్తూ, ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈ సమయంలో పొత్తులకు చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిపిన ఆయన, అభిమానులు ఎవరూ తొందరపడవద్దని అన్నారు. మక్కల్ మండ్రం తమిళనాడులో చాలా బలంగా ఉందని చెబుతూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన, పార్టీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.  కాగా, ఈ సమావేశానికి కేవలం 50 మందిని మాత్రమే పిలిపించగా, రాఘవేంద్ర కల్యాణ మండపం బయట మాత్రం వేలాది మంది అభిమానులు రజనీ అనుకూల నినాదాలు చేస్తూ కనిపించారు. 

దాదాపు నాలుగేళ్ల క్రితమే దేవుడు ఆశీర్వదిస్తే రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన తలైవా, ఇంతవరకూ ఆ విషయంలో స్పష్టతను మాత్రం ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఇక నేటి సమావేశం అనంతరం రజనీ ఓ ప్రకటన విడుదల చేస్తారని, అందులో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారని అభిమాన సంఘాల నేతలు అంటున్నారు.


 

For All Tech Queries Please Click Here..!