కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
ఉత్తర కోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు.
ఎల్లుండి (13 ఆగస్టు) నాటికి వాయువ్య,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సహాయక చర్యలకోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని కోరారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి కాకినాడ జిల్లా రౌతలపూడిలో 42.2మిమీ, అల్లూరి జిల్లా పెదబయలులో 41మిమీ, అనకాపల్లిలో నర్సీపట్నంలో 40.2మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 38మిమీ వర్షపాతం నమోదైందన్నారు.
