డీఎస్సీ 2008 అభ్యర్థులకు శుభవార్త.. వారం రోజుల్లో పోస్టింగ్!

Thursday, February 13, 2025 09:00 AM News
డీఎస్సీ 2008 అభ్యర్థులకు శుభవార్త.. వారం రోజుల్లో పోస్టింగ్!

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారం రోజుల్లో కొలువులు వరించనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చినప్పటికీ దానిని రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదు. దీంతో మరో మారు డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. డీఎస్సీ-2008లో నష్టపోయిన మొత్తం 1399 మంది అభ్యర్ధులకు విద్యాశాఖ వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. వారందరినీ సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ)లుగా నియమిస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో ఉత్తమ మార్కులు సాధించినా, మెరిట్‌ జాబితాలో ఉన్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు. దీంతో అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని వారంతా సర్కార్‌తో పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వారందరికీ కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీ ఉద్యోగాలను మినిమం టైమ్‌ స్కేల్‌ కింద ఇవ్వాలని 2024 సెప్టెంబరు 24న నిర్ణయం తీసుకుంది. 2008 డీఎస్సీలో నష్టపోయిన వారిలో 2,367 మంది అభ్యర్ధులు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు తీసింది. ఆ మేరకు వారందరికీ ధ్రువపత్రాల పరిశీలన కూడా చేశారు. రేవంత్‌ సర్కార్‌ ఆదేశాల మేరకు వీరందరికి కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. మరో వారం రోజుల్లో వారికి నియామకపత్రాలు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు గత ఏడాది నవంబర్‌లో ఈవీ నరసింహారెడ్డి ప్రకటించారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: