విద్యార్థులతో కారు కడిగించిన టీచరమ్మ

బడిలో విద్యార్ధులు పాఠాలు చెప్పి, విద్యా బుద్ధులు నేర్పించవల్సిన ఓ టీచరమ్మ పిల్లలతో కారును కడిగించింది. కారు కడగకపోతే టీచర్ కొడుతుందేమోనన్న భయంతో ఎండలో టీచర్ కారును కడిగారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసాడు. దీంతో టీచర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన తూర్పు గోదావరిలోని రంగంపేట మండలం వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.
రంగంపేట మండలం వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయిని డి సుశీల తన కారును పాఠశాల ఆవరణలో విద్యార్థినులతో కడిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో ముగ్గురు విద్యార్థినులతో పాటు సదరు టీచర్ కూడా కారును శుభ్రం చేస్తుండటం కనిపించింది. దీనిపై సర్వత్రా చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఎంఈవో-2 మధుసూదన్రావు సదరు అంశంపై విచారించి, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన కలెక్టర్ పి ప్రశాంతి వెంకటాపురం ఎంపీయూపీ పాఠశాల టీచర్ డి సుశీలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.