ఎమ్మెల్యే రాజాసింగ్కు ఊరట.. మూడు కేసుల్లో నిర్దోషిగా తేల్చిన కోర్టు

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను మరో మూడు కేసుల్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించిన మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులను విచారించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజా సింగ్ను నిర్దోషిగా ప్రకటించింది.
ఎమ్మెల్యే రాజాసింగ్పై 2022లో పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. 2022 ఫిబ్రవరి 19న మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ప్రయోగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మతపరమైన కామెంట్లు చేశారనే ఆరోపణలతో రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ టైమ్లో 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించలేదని రాజాసింగ్ రిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. రాజాసింగ్ రిమాండ్ రిజెక్ట్ కావడంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆయనపై లోగడ నమోదైన కేసులను కొత్తగా పరిశీలించారు. పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు అనుకూలంగా మంగళ్హాట్, షాహినాయత్ గంజ్ స్టేషన్లలో నమోదైన కేసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుల్లో రాజా సింగ్ ను నిర్దోషిగా తేల్చారు.