మునిగిపోతున్న రాజధాని
ఏపీ రాజధాని ప్రాంతంతో పాటు చుట్టుపక్కలున్న మంగళగిరి, తాడికొండ, పెదపరిమి, నీరుకొండ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. మంగళవారం అర్థరాత్రి కురిసిన వర్షంతో రాజధాని కోసం కొత్తగా ఆమోదించిన పెద్దమద్దూరు, ప్రతిపాదిత మోతడక, నిడుముక్కల ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి. ఎద్దువాగు పొంగడంతో అమరావతి విజయవాడ, కొట్టేళ్లవాగు, కొండవీటివాగు పొంగడంతో గుంటూరు తాడికొండ అమరావతి మధ్య రాకపోకలు నిలిచాయి. జాతీయ రహదారిపై కాజ టోల్గేట్ వద్ద నీరు నిలిచి రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. మంగళగిరి టిక్కో కాలనీ నీటమునిగింది. విజయవాడ దగ్గర బుడమేరులోకి నీరురావడంతో కట్టపక్కన ఉంటున్న ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. అయితే రెగ్యులేటర్ వద్ద నీరు లేదని కలెక్టర్ ప్రకటించారు.
ఉండవల్లిలో వరిపొలాలు నీటమునిగాయి. కుంచనపల్లి వద్ద పొలాల్లోపెద్దఎత్తున నీరు నిలిచి ఆకుకూరలు, పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇబ్రహీంపట్నంలో పలుకాలనీల్లో అడుగుమేర నీరొచ్చింది. సుదీర్ఘకాలం తరువాత సీతానగరంలో మేఘా లిఫ్టు ద్వారా నీటిని తోడి కృష్ణానదిలో పోస్తున్నారు. అమరావతి రాజధాని నగరంలో జిఎడి టవర్ల ర్యాఫ్టుల్లో రెండు వర్షపునీటితో నిండాయి. బుధవారం అర్థరాత్రికి మరింత నీరొచ్చి చేరే ప్రమాదం ఉంది. మరోవైపు రాజధానిలోకి వచ్చి చేరే నీరు బయటకు వెళ్లే కాలువల్లో అడ్డంకులు ఏర్పడ్డాయి. జాతీయ రహదారితోపాటు, ఈ 8,9,10,11 రోడ్లపై వంతెనల నిర్మాణాల సమయంలో కాలువలు పూడిపోయాయి. వాటిని సరిచేయలేదు. వెంకటపాలెం సమీపంలో జాతీయ రహదారి నిర్మాణ సమయంలో పాలవాగు వంతెన వద్ద కాలువ పూడుకుపోయింది. దీన్ని క్లియర్ చేయలేదు. జాతీయ రహదారి నిర్మించడంతో కొండవీటివాగు నుండి వచ్చే నీరు కూడా వచ్చి ఇదే మార్గం నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మార్గం లేకపోవడంతో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాయపాలెం వద్ద కొండవీటివాగులో గుర్రపుడెక్క పెరిగింది. దీన్ని తొలగించాలని రైతులు గతంలో సిఆర్డిఏ కమిషనర్ దృష్టికి తీసుకెళితే ఆగస్టు, సెప్టెంబరు నాటికి క్లియర్ చేస్తామని చెప్పినా పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు నీటికి అడ్డుపడుతోంది. జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ వద్ద రెండు అడుగులకుపైన నీరు నిలిచింది. బయటకు పోయేమార్గం లేకపోవడంతో గంటల తరబడి నిలిచిపోయింది. మంగళగిరి నగరంలో ఎక్కడికక్కడ వర్షపునీటితో నిండిపోయాయి. తాడికొండ మండలం, తుళ్లూరు మండల పరిధిలోని రాజధానికి సరిహద్దు గ్రామాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు చేరింది. అమరావతి బ్లూప్లాన్లో భాగంగా తవ్విన కాలువలలోకి వచ్చే నీరు బయటకు వెళ్లే మార్గం సరిగా ఏర్పాటు చేయలేదు.

.jpg)
.jpg)
.jpg)