ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. నిందితునికి ఉరిశిక్ష

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏ2 శుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి అమృతరావు గతంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే.
2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత, అదే ఊరికి చెందిన ప్రణయ్లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ జరిపిన పోలీసులు, ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టులో 5 సంవత్సరాల 9 నెలల పాటు కేసు విచారణ జరిగింది. చార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ఏ2 సుభాష్ శర్మకు మరణ శిక్ష, మిగిలిన నిందితులకు జీవితఖైదు విధించింది.