వీడిన మలక్ పేట హత్యకేసు మిస్టరీ

మలక్పేటలో హత్యకు గురైన శిరీషను ఆడపడుచే హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు. బుధవారం చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ రాజు, డీఐ భూపాల్గౌడ్, ఎస్ఐ రవిరాజ్లతో కలిసి సౌత్ ఈస్ట్జోన్ మలక్పేట డివిజన్ ఏసీపీ శ్యాంసుందర్ ఈ ఘటన వివరాలు వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా పరకాలకు చెందిన శిరీష (32) కు ఐదేండ్ల వయస్సులోనే తల్లిదండ్రులు చనిపోవటంతో ఆమెను ఒక ప్రొఫెసర్ దత్తత తీసుకొని పెంచి పెద్దచేశారు. ఆ తర్వాత శిరీష వారి వద్ద నుంచి వెళ్లొచ్చి బయటనే ఉంటూ బీఎస్సీ నర్సింగ్ చేసింది. పదేళ్లుగా వివిధ ఆస్పత్రులలో నర్సుగా పని చేసింది. నాగర్కర్నూల్ జిల్లా సున్నిపెంట చెందిన వినయ్ ఓ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా అతని సోదరి సరిత 2016లో ఒకే ఆస్పత్రిలో ఉద్యోగిగా పని చేశారు. ఆ సమయంలో సదరు ఆస్ప్రతిలో నర్సుగా చేరిన శిరీషకు సరితతో సాన్నిహిత్యం పెరిగింది. సరిత తన తమ్ముడికి నచ్చజెప్పి శిరీషను ఒప్పించి 2016లో ఇద్దరికి పెళ్లి జరిపించింది. ప్రస్తుతం వీరికి రెండేండ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అయిన నాటినుంచి వినయ్, శిరీష దంపతులు మలక్పేటలోని జమునా టవర్స్లో నివాసం ఉంటున్నారు.
సరిత భర్త విదేశాల్లో ఉండడంతో ఆమె కూడా వీరిద్దరితోనే అదే ఇంట్లో నివాసం ఉంటున్నది. అయితే ఇటీవల నర్సుగా పని మానేసి ఇంటి వద్ద ఉంటున్న శిరీషను సరిత మందలించింది. పదే పదే ఉద్యోగం వదులుకోవడం తగదంటూ ఘర్షణ పడింది. ఇటీవల సరిత, శిరీషల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 2 శనివారం అర్ధరాత్రి 11.30 గంటలకు సరిత-శిరీషలు గొడవ పడి కొట్టుకున్నారు. శిరీషను సరిత తీవ్రంగా గాయపరిచింది. కాస్త సద్దుమణిగాక తనకు అస్వస్థతగా ఉందని చెప్పిన శిరీషక సరిత తాను వాడుకునే మత్తుమందును అధిక మోతాదులో శిరీషకు ఇచ్చింది. దీంతో శిరీష మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా శిరీషకు ఊపిరి ఆడకుండా సరిత దిండు అదిమి ప్రాణం పోయేలా చేసింది. ఈ విషయాన్ని మరుసటి రోజు ఉదయం తమ్ముడు వినయ్కు చెప్పింది. ఇదంతా తెలుసుకున్న వినయ్ అక్కను కాపాడే ప్రయత్నంలో శిరీషకు గుండెపోటు వచ్చిందంటూ చెప్పి ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లి అది సహజ మరణమేనని నమ్మించాడు. అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడి శిరీష మృతదేహాన్ని సున్నిపెంటకు తరలించే ప్రయత్నం చేశాడు.
ఇంత హడావుడిగా అంబులెన్స్ను తీసుకెళ్లే ప్రయత్నంపై శిరీష మేనమామ మధుకర్కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అంబులెన్స్ను వెనక్కి పిలిపించి పోస్టుమార్టం చేయిస్తే అసలు బండారమంతా బయటపడింది. శిరీషకు ఊపిరాడకుండా చేసి చంపివేసి ఉంటారని పోస్టుమార్టం చేసిన వైద్యులు వెల్లడించడంతో వినయ్, సరితలను పోలీసులు విచారించారు. ఈ హత్యకు తానే పాల్పడినట్లు సరిత ఒప్పుకున్నదని పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో సరిత, వినయ్లతో పాటు భిట్టు అనే మరో నిందితుడిపై కూడా హత్యకు సంబంధించిన కసులు పెట్టారు. మరింత లోతైన విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.