పక్కింట్లోనే ఉంటూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు... చివరకు గంటల్లోనే..
తల్లిదండ్రులు తమ ప్రేమను నిరాకరించారని మనస్థాపనతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలోని పండితాపురంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో పక్క పక్కన ఇళ్లలో ఉండే బండి హారిక, గాడిపల్లి శ్రీకాంత్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ గురించి ఇళ్లల్లో చెప్పారు. హారిక తల్లిదండ్రులు వీరి ప్రేమను నిరాకరించారు. దీంతో హారిక తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హారిక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని సమాచారం తెలుసుకున్న శ్రీకాంత్ హారిక చనిపోయిన రెండు గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు ఇద్దరు చనిపోవడంతో పండితాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.
మృతుల ఇళ్లు పక్క పక్కనే ఉండడంతో ఇద్దరి కుటుంబాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని పోలీసుల అలర్ట్ అయ్యారు. ఇరువురి నుంచి కంప్లైంట్ తీసుకొని ఒకరిపై ఒకరు గొడవలు పడకుండా పోలీసులు సమన్వపరిచారు. అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య మొదటిగా అమ్మాయి మృతదేహాన్ని గ్రామానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. తరువాత అబ్బాయి మృతదేహాన్ని గ్రామానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.



