మదనపల్లెలో ఇద్దరు కూతుర్లను దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు

Saturday, March 20, 2021 02:15 PM Crime
మదనపల్లెలో ఇద్దరు కూతుర్లను దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు

Amaravati, Jan 25: చిత్తూరు జిల్లాలో ఇద్దరు యువతులను కన్న తల్లిదండ్రులే దారుణంగా హత్య చేయడం (Andhra Pradesh Horror) సంచలనం రేపుతోంది. తన ఇద్దరు కుమార్తెలను ఆ కసాయి తల్లిదండ్రులు డంబెల్స్‌తో కొట్టి హత్య (Daughters allegedly beaten to death by parents) చేశారు. మృతులను అలేఖ్య (27), సాయి దివ్య (22)గా పోలీసులు గుర్తించారు. తల్లి పద్మజ మాస్టర్స్ మైండ్స్ కాలేజీ కరెస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌గా, తండ్రి పురుషోత్తమనాయుడు మదనపల్లె ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. అలేఖ్య, సాయి దివ్య ఇద్దరు కూడా ఉన్నత విద్య అభ్యసించారు. తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా లిమిట్స్ దాటిపోయి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.

'సత్యలోకం తిరిగి వస్తుంది. మా బిడ్డలను మేం తిరిగి బతికించుకుంటాం.. ఒకరోజు గడువు ఇవ్వండి, మా పిల్లలు లేచి వస్తారని ఆ తల్లిదండ్రులు పోలీసులతో చెప్పడం వారి మానసిక స్థితి ఎలా ఉందో తెలియజేస్తోంది. అయితే ఎవరి సూచనల మేరకు ఈ పూజలు చేశారు... ఏం ఆశించి బిడ్డలను చంపుకున్నారన్నది ఇంకా తెలియరాలేదు.
 
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వీరంతా గత ఏడాది ఆగస్టులో మదనపల్లె (Madanapalle) శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయని పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే డీఎస్పీ రవి మనోహరాచారి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు.

అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా దేవుడు, దేవుడికి దాటి ఎక్కడికో వెళ్లిపోయారని చెప్పారు. ఇందులో భాగంగానే ఇద్దరు అమ్మాయిలకు పూజలు చేసి, డంబెల్‌తో కొట్టి చంపారని డీఎస్పీ వెల్లడించారు. ఈ ఒక్క రోజు రాత్రి ఆగండి.. పిల్లలు తిరిగి లేచి వస్తారు అని చెబుతున్నారని వెల్లడించారు. వీళ్లు చెబుతున్న దాన్ని బట్టి పూర్తిగా ఆధ్యాత్మికంగా దాటి వెళ్లిపోయారని వివరించారు. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులని వెల్లడించారు. పెద్దమ్మాయి.. భోపాల్, మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చదివిందని, చిన్నమ్మాయి బీబీఏ చదివి.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహహాన్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుంటుందని వివరించారు.

అయితే ఈ  దారుణం జరిగింది ఇంట్లోనే..గత ఏడాదిగా కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఇంట్లోకి పని వాళ్లను కూడా రానివ్వడం లేదని పోలీసులు చెప్పారు. పని వాళ్లు కూడా బయటే పని చేసుకుని వెళ్లిపోతున్నారని వివరించారు.  ఈ ఘటనతో రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఉన్నత విద్యావంతులే ఆధ్యాత్మిక పిచ్చితో కన్న పిల్లల్నే దారుణంగా చంపడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు.

ఇదిలా ఉంటే మృతుల్లో ఒకరైన సాయి దివ్య మూడు రోజుల క్రితం సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టినట్లుగా విచారణలో తేలింది. ‘శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్’ అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చి తరచూ ఘటన జరిగిన ఇంట్లో పూజలు చేసేవారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీ టీవీ పూటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే మృతుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంట్లోనే విచారిస్తున్నారు. నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజలపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆ నివాసంలో దేవుళ్లతోపాటు చిత్ర విచిత్రంగా ఉన్న ఫోటోలను పోలీసులు గమనించారు. నిందితులకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం.. వైద్యుల సలహాతోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఆధారాలను సేకరించేందుకు సోమవారం ఉదయం క్లూస్ టీమ్ కూడా మదనపల్లెకు వెళ్లింది.

పురోషత్తం నాయుడు-పద్మజ మానసిక స్థితి సరిగా లేనందునా... ఆ ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
 

For All Tech Queries Please Click Here..!