టిసిఎస్ కు భారీ లాభాలు.. వేతన పెంపు ఎలా ఉంటుంది..?
అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మెరుగైన ఫలితాలను ప్రకటించింది. 2025-26 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1) 6 శాతం వృద్ధితో రూ.12,760 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.12,040 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.62,613 కోట్ల ఆదాయాన్ని ప్రకటించగా గడిచిన క్యూ1లో 1.3 శాతం పెరుగుదలతో రూ.63,437 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితుల కారణంగా డిమాండ్ తగ్గిందని కంపెనీ సిఇఒ కె కృతి వాసన్ వెల్లడించారు. ఫలితాల సందర్బంగా మధ్యంతర డివిడెండ్ కింద ప్రతీ షేర్పై రూ.11 చొప్పున చెల్లించడానికి ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. దీనికి జులై 16వ తేదీని రికార్డు డేట్గా నిర్ణయించారు. ఆగస్టు 4న చెల్లింపులు చేయనున్నట్లు ప్రకటించారు.
గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాదిలో నికర నియామకాలు 5,090 పెరిగినట్లు టిసిఎస్ వెల్లడించింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069కు చేరింది. ఈ ఏడాది ఉద్యోగులకు వేతనం పెంపు అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టిసిఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. భౌగోళికంగా సూక్ష్మ పరిస్థితులు మెరుగుపడితే సాధారణంగానే తాము మంచి పెంపుదల ఇస్తామన్నారు.



