ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ నిధులు.. డబ్బులు పడాలంటే ఇవి తప్పనిసరి

News Published On : Thursday, February 13, 2025 08:00 AM

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది దేశంలోని చిన్నా, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. మూడు విడుతల్లో రూ.2000 నిధులు మంజూరు చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్రం 18 విడుతల నిధులను మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబర్‌ 5న 18వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక ఇప్పుడు 19వ విడత నగదు సాయం కోసం దేశంలోని రైతులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరికి తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో రైతులందరి ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడతాయని చెప్పారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఈ స్కీం ప్రయోజనం అందుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకుని ఉండాలి. పూర్తి చేయని రైతులకు ఈ విడతలో డబ్బులు పడవు. ఇక మొబైల్‌లో ఇంట్లోనే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ వెళ్లి కూడా ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయని రైతులు కూడా ఈ విడతలో సహాయం పొందేందుకు అర్హులు కాదు. ఇక రాజ్యంగపరమైన పోస్టుల్లో ఉన్నవారు, గతంలో సేవలందించిన వారు, మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పంచాయతీ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ కంపెనీలు, ఆటోనమస్ బాడీ, లోకల్ బాడీ ఉద్యోగులు, రూ.10 వేలకుపైగా పెన్షన్ అందుకుంటున్న వారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్టులకు పీఎం కిసాన్ పథకానికి అనర్హులు.