చైనా నుంచి మరో షాకింగ్ న్యూస్, 4,800 ఐస్ క్రీం బాక్సుల్లో కరోనావైరస్

News Published On : Monday, March 15, 2021 12:00 PM

Tianjin, January 16: చైనా నుంచి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ఐస్‌క్రీం బాక్సుల్లో కూడా కరోనా జాడను (Ice Cream Infected With Coronavirus) గుర్తించారు.  4,800 ఐస్‌క్రీం బాక్సుల్లో కరోనావైరస్ ఉందని చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం ఈ వైరస్‌ (Covid in China) ఎక్కడి నుంచి వచ్చింది? ఎందరికి వ్యాపించింది? అనే విషయాలపై ఆరా తీసే పనిలో పడింది. 

ఈ ఘటన చైనా ఈశాన్య ప్రాంతంలోని టియాన్జియాన్‌ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానిక టియాన్జిన్‌ డకియావోడావో ఫుడ్‌ కంపెనీలో తయారైన ఐస్‌క్రీం శాంపిళ్లను పరీక్షించగా కరోనా వైరస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో బట్వాడా కాని 2,089 ఐస్‌క్రీం బాక్సులను కంపెనీ స్టోర్‌ రూంలోనే సీల్‌ వేసి ఉంచారు.

మిగతా, 1,812 ఐస్‌క్రీం బాక్సులు వివిధ ప్రావిన్సులకు, 935 బాక్సులు స్థానిక మార్కెట్‌కు పంపిణీ కాగా అందులో 65 మాత్రం అమ్ముడు పోయినట్లు తేలింది. సరఫరా అయిన ప్రాంతాల్లో విచారణ చేపట్టి, వాటి ద్వారా ఎవరికైనా వైరస్‌ సోకిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ఆ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలోని 1,662 మంది ఉద్యోగులను సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. 

ఆ కంపెనీ ఐస్‌క్రీం తయారీలో వాడిన పాలపదార్థాలు ఉక్రెయిన్, న్యూజిల్యాండ్‌ నుంచి వచ్చినట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ అధికారులు..అవి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాక్సుల్లో వైరస్‌ ఘటనపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీ వైరాలజిస్టు గ్రిఫ్ఫిన్‌ అన్నారు.