మాట్లాడుతున్న బాలు, ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుందని తెలిపిన కుమారుడు చరణ్

Entertainment Published On : Wednesday, September 16, 2020 04:15 PM

తన తండ్రి మరింత వేగంగా కోలుకుంటున్నారని, ఎంతో హుషారుగా వ్యవహరిస్తున్నారని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. బాలు ఆరోగ్యం గురించి సోమవారం సాయంత్రం ఆయన వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ‘నేను ఈనెల 10న మీడియాతో మాట్లాడాను. ఈ నాలుగు రోజుల్లో నాన్న ఆరోగ్యంలో గణనీయ మార్పు వచ్చింది. ఫిజియోథెరపీ కొనసాగుతోంది.

వైద్యులు కూర్చోబెట్టగా 15–20 నిమిషాల వరకు వారితో మాట్లాడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య కూడా నయం అవుతోంది. ఆరోగ్యంలో మరింత పురోగతి కనపడుతోంది. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. తర్వాత ఆయనకు ఎక్మో సాయం అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.  ఆయనకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది.