Movie on AP English Medium: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై సినిమా :  ఆర్‌. నారాయణమూర్తి

Entertainment Published On : Thursday, January 21, 2021 02:00 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఆవశ్యకత, యూనివర్సిటీల్లో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక తదితర అంశాలపై త్వరలో సినిమా (Movie on AP English Medium) నిర్మించనున్నట్లు  ప్రముఖ తెలుగుసినిమా దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడతానని విప్లవ హీరో తెలిపారు. ఆదివారం నర్సీపట్నం వచ్చిన ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ సామాజిక అంశాల ఆధారంగా (English medium in andhra pradesh govt schools) సందేశాత్మకంగా ఈ సినిమా ఉంటుందన్నారు. కరోనావైరస్ చిత్ర పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపించిందని, ఈ కారణంగా సినిమా నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. తాను తీయబోయే సినిమాను విశాఖ, విజయనగరం జిల్లాల్లో చిత్రీకరిస్తానని నారాయణమూర్తి (R Narayana Murthy) తెలిపారు.

ఇదిలా ఉంటే ఏపీ సీఎం పాలనను ఆర్ నారాయణ మూర్తి మెచ్చుకున్నారు. ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయొచ్చని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రెండు జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చొరవ చూపిన అపర భగీరథుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు.

తూర్పుగోదావరి జిల్లా అంటే.. కోనసీమ, గోదావరి డెల్టా అని చాలామంది అనుకుంటారని.. కానీ ఆ జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలో 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయన్నారు. దీనివల్ల ఈ ప్రాంతం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాండవ రిజర్వాయర్‌ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి.. వెంటనే తగిన కార్యాచరణ చేపట్టడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు.

రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అనుసంధాన ప్రాజెక్టుతో తాండవ, ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం  సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.