ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్‌‌ను తిప్పి పంపిన ఏపీ ప్రభుత్వం

Tuesday, March 23, 2021 12:00 PM News
ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్‌‌ను తిప్పి పంపిన ఏపీ ప్రభుత్వం

Amaravati, Jan. 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లపై ఇచ్చిన సెన్సూర్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిప్పి పంపింది. కాగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఈ ఐఏఎస్ అధికారులపై (IAS officers) ప్రొసీడింగ్స్‌ను జారీ చేసిన సంగతి విదితమే.. వీటిని ఆమోదించాలని ఏపీ ప్రభుత్వానికి (Andhra Pradesh government) ఎస్ఈసీ పంపగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాటిని ఆమోదించలేమంటూ తిప్పి పంపింది.

ఎస్‌ఈసీకి ఆ అధికారం లేదని అధికారుల వివరణ లేకుండా ప్రొసీడింగ్స్‌ను (SEC proceedings) జారీ చేయలేరన్న ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం లేదని తెలిపింది. అసలు అధికారుల వివరణ కూడా పెనాల్టీ ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించింది. ఇద్దరు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం తప్పు బట్టింది. ఇదిలా ఉంటే పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ ‌కుమార్‌ నో చెప్పిన సంగతి విదితమే. 

కీలకంగా వ్యవహరించాల్సిన ఈ ఇద్దరినీ ఎన్నికల ప్రక్రియ (AP Panchayat Polls) మధ్యలో బదిలీ చేయడంవల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కనుక ఈ ప్రతిపాదనను అంగీకరించలేమంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్ఈసీ ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలన్నారు. 

గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ (SEC Nimmagadda Ramesh Kumar) కలిశారు. వీరి భేటీ వివరాలను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియకు తెలిపారు. ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వారదిగా ఉంటానని గవర్నర్ హరిచందన్ (Governor Harichandan) హామీ ఇచ్చినట్లు రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం, ఉద్యోగుల పాత్రపై గవర్నర్ నిర్మాణాత్మక సూచనలు చేశారన్నారు.  ఆ సూచనలను పాజిటివ్ దృక్పథంతో స్వీకరించి ఎన్నికలను విజయవంతం చేయాలని భావిస్తున్నామని రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆదిత్యానాథ్ దాస్‌తో వ్యక్తిగతంగా తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. తాను వారిని సస్పెండ్ చేస్తానని చెప్పలేదని, కేవలం అభిశంసన మాత్రమే చేశానని పేర్కొన్నారు. ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తోంది. నేను కూడా ఉద్యోగినే. నాకు ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావం లేదు. ప్రభుత్వంపై నా మనసులో ఎలాంటి కక్ష లేదు. ఓటు హక్కు కోసం దుగ్గిరాల వెళ్లా. నా ఓటు హక్కు సాధించేందుకు ఎంతవరకైనా వెళతా. కోడ్ ఆప్ కండక్ట్ విషయంలో ప్రభుత్వం పెద్దలు సంయమనం పాటించాలని నిమ్మగడ్డ రమేశ్ సూచించారు.
 

For All Tech Queries Please Click Here..!